POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 7:29 pm Posted by : POLITICAL POWER

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలకు కొత్త దిశ – డా. మల్లురవి వ్యాఖ్యలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: సోమవారం రోజు ప్రకటించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి స్పందించారు. ఆయన ప్రకారం, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పార్టీకి సానుకూల సంకేతంగా నిలిచిందన్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ బలాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం బీజేపీకి ప్రతికూల పరిణామమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని కొనసాగించగలిగిందని తెలిపారు. డీఎంకే నేత స్టాలిన్, టీఎంసీ నేత మమతా బెనర్జీ, టీవీకే నాయకుడు విజయ్ తదితరులు ఇండియా కూటమిలో చేరే అవకాశమున్న నేపథ్యంలో, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్‌డీఏ కంటే బలంగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేరళలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ఆశలను చెదరగొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.