POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 5:09 pm Posted by : POLITICAL POWER

 

 

 

*బిగ్ బ్రేకింగ్: గన్‌పాయింట్ దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ – 2 కోట్ల ప్రాపర్టీ దొంగతనం… 50 గంటలు గడిచినా జాడ లేదు!*

 

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

హైదరాబాద్, మే 5:
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో కరీంనగర్‌లో జరిగిన సంచలన గన్‌పాయింట్ దోపిడీ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లాలోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన ఈ ఘటనలో రెండు కోట్ల ప్రాపర్టీ దొంగతనం జరగగా, 50 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

*“నందుర్బార్” క్లూ తో కొత్త మలుపు*

ఘటనా స్థలంలో దుండగులు వదిలేసిన బ్యాగుపై “ఐ లవ్ నందుర్బార్” అని రాసి ఉండటం కేసులో కీలక క్లూగా మారింది. దీంతో మహారాష్ట్రలోని నందుర్బార్ ప్రాంతంతో సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

*16 బృందాలుగా గాలింపు – రాష్ట్ర సరిహద్దులు దాటి అన్వేషణ*

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 16 బృందాలుగా విభజించి, దాదాపు 100 మంది సిబ్బందితో రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా అన్వేషణ విస్తరించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ద్వారా నిందితుల కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.

*ప్రజల్లో భయాందోళన – వ్యాపారుల ఆందోళన*

నగరంలో తుపాకులతో దోపిడీ జరగడం స్థానిక ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ముఖ్యంగా వ్యాపార వర్గాలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ కేసు త్వరగా ఛేదించడమే ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.