POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 11:46 am Posted by : POLITICAL POWER

*వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!*

*బెదిరింపులతో పలుమార్లు అత్యాచారం*

సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరించి లైంగిక దాడి.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘోరం

హైదరాబాద్‌, మే 15 :

సమాజాన్ని కలచివేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె బాబాయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబ బంధాలను మరిచి అమానుషంగా ప్రవర్తించిన నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా తిరుపతిలో నివసిస్తున్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో పిన్ని భర్త రామమూర్తి బాలికను బెదిరింపులకు గురిచేస్తూ ఆమె వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ మానసికంగా భయపెట్టాడు. ఆ బెదిరింపులను ఆసరాగా చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.

కొద్ది రోజుల తర్వాత పరీక్షల కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన బాలిక తీవ్ర మానసిక ఆందోళనలో ఉండటాన్ని గమనించిన తల్లి, కుమార్తెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఘటన తిరుపతి పరిధిలో జరగడంతో కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన మరోసారి బాలికల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. కుటుంబ సభ్యులే నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.