POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 5:45 pm Posted by : POLITICAL POWER

జూన్ 3న పాఖల్ కొత్తగూడలో జరిగే ఆదివాసుల పోరుకేక

భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

 

సర్పంచ్‌ల హామీ – భారీ బహిరంగ ను విజయవంతం చేస్తాం

 

గంగారం, మే 21:

జూన్ 3వ తేదీన పాఖల్ కొత్తగూడలో నిర్వహించనున్న “ఆదివాసుల పోరుకేక” భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంగారం మండలంలోని 12 గ్రామపంచాయతీల గౌరవ సర్పంచ్‌లతో కలిసి సభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం గంగారం మండల కేంద్రంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు, అస్తిత్వ పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహాసభకు ప్రతి ఆదివాసి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అడవులు, భూములు, జలాలు, ఉద్యోగాలు, విద్య, ఉపాధి వంటి అంశాలలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సభ కీలక వేదిక అవుతుందని తెలిపారు. ఆదివాసుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ఆదివాసుల హక్కులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు పేర్కొన్నారు. ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతి గ్రామం నుండి యువత, మహిళలు, పెద్దలు భారీగా సభకు హాజరుకావాలని కోరారు. ఈ సభ ఆదివాసుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

 

ఈ సందర్భంగా గంగారం మండలంలోని గౌరవ సర్పంచ్‌లు మాట్లాడుతూ, “జూన్ 3న జరిగే ఆదివాసుల పోరుకేక సభను విజయవంతం చేయడం మా అందరి బాధ్యత. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు సభ ప్రాముఖ్యతను వివరించి, ప్రతి గ్రామం నుండి భారీగా ప్రజలను తరలించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఆదివాసుల హక్కుల కోసం(లంబాడిలను తొలిగించే వరకు )జరిగే ఈ మహాసభకు మద్దతుగా మేమంతా ఐక్యంగా నిలుస్తాం” అని తెలిపారు.

 

అలాగే సభ విజయవంతం కోసం గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, యువతను చైతన్యపరిచి, ప్రతి కుటుంబానికి సభ సందేశాన్ని చేరవేస్తామని సర్పంచ్‌లు పేర్కొన్నారు. ఆదివాసుల భవిష్యత్తు కోసం జరిగే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కుంజ. నర్సింగారావు, జిల్లా కార్యదర్శి కల్తీ. శేఖర్, గంగారం మండల తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్, వైస్ ప్రెసిడెంట్ మునేష్, ఉపాధ్యాయ సంఘ నాయకులు నాగేశ్వర్ రావు, ఎల్లయ్య, గౌరవ సర్పంచ్‌లు రాము, లక్ష్మణ్ రావు, వీరభద్రం, స్వరూప, సంధ్యారాణి, పార్వతమ్మ, రామారావు, సురేష్, సుధాకర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.