POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 5:55 pm Posted by : POLITICAL POWER

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

*నైరుతి రుతుపవనాల ప్రభావం.. పలు జిల్లాల్లో వర్ష సూచనలు | గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక*

 

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా.. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

 

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వైపు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

 

దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

 

*మూడు రోజుల వాతావరణ సూచన*

 

ఆదివారం, సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.

 

వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఉష్ణోగ్రతలు తగ్గినా.. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

*కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక*

 

వర్షాల సూచనలు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, ఈదురుగాలుల సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని తెలిపారు.