ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: గొండ్వాన సంక్షేమ పరిషత్
పొలిటికల్ పవర్, చర్ల, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టూరిజం హబ్లో ప్రకృతి అందాలకు నెలవైన తాలిపేరు ప్రాజెక్టును కూడా చేర్చి అభివృద్ధి చేయాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు బీరబోయిన శేఖర్ డిమాండ్ చేశారు.
చర్ల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఇర్ప అంజిబాబు అధ్యక్షతన శుక్రవారం గొండ్వాన సంక్షేమ పరిషత్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీరబోయిన శేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వాజేడు మండలం బొగత జలపాతం వరకు ఏర్పాటు చేయబోయే టూరిజం హబ్లో కిన్నెరసాని, బొగత జలపాతం, పులిగుండాల తదితర పర్యాటక ప్రాంతాలతో పాటు తాలిపేరు ప్రాజెక్టును కూడా చేర్చాలని కోరారు.
చత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే మూడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యంతో పాటు ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
తాలిపేరు పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండటంతో అనేక రకాల వనమూలికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో వనమూలికల ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీని ద్వారా ఆయుర్వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ ప్రాంతం అధ్యయన, సందర్శన కేంద్రంగా ఉపయోగపడుతుందని అన్నారు.
తాలిపేరు ప్రాజెక్టును టూరిజం హబ్లో చేర్చేలా ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బీరబోయిన శేఖర్ కోరారు. పర్యాటక అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కారం పద్మ, తెల్లం సునీత, తులసి తదితరులు పాల్గొన్నారు.

