POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:16 am Posted by : POLITICAL POWER

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. యువతకు ఎస్‌ఐ రవిచంద్రకుమార్ సూచన

బిక్కవోలు ఆగస్టు 18: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అరికరేవుల గ్రామంలో బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ‘కనెక్ట్ యూత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది యువత, గ్రామస్థులు పాల్గొన్నారు. యువతను పోలీస్ శాఖకు మరింత చేరువ చేయడం, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రవిచంద్రకుమార్ యువతతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలు తదితర అంశాలపై చర్చించారు. యువత చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత తమ ప్రతిభను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు.

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ప్రజలు, ముఖ్యంగా యువత సహకరించాలని ఎస్‌ఐ రవిచంద్రకుమార్ కోరారు.

యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందించడంతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ‘కనెక్ట్ యూత్’ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.