POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:29 pm Posted by : POLITICAL POWER

గురు పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర షిర్డి సాయి మందిర్‌కు పోటెత్తిన భక్తజనం

 

 

తూర్పుగోదావరి జిల్లా: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిర్డిగా ప్రసిద్ధి చెందిన సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయినాథుని దివ్య దర్శనం చేసుకుని గురుకృపను పొందారు.

ఉదయం వేళ కాకడ హారతితో ప్రారంభమైన కార్యక్రమాలు గణపతి పూజ, శ్రీచక్ర పూజలతో కొనసాగాయి. అనంతరం సాయిబాబా మూలవిరాటుకు  1008 లీటర్ల ఆవుపాలతో మహా పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా పాలాభిషేకంలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందారు.

ప్రత్యేక పుష్పాలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన సాయిబాబా భక్తులకు దివ్య మంగళ స్వరూపంలో దర్శనమివ్వగా, ఆలయం అంతా “జై సాయిరాం” నినాదాలతో మార్మోగింది. బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.

ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆలయానికి విచ్చేసి సాయిబాబా ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణ వంటి సౌకర్యాలను సమకూర్చగా, పోలీసులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించారు.

మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించిన పల్లకిలో గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, సాయినామ స్మరణలతో ఊరేగింపులో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ మహోత్సవం బలభద్రపురం గ్రామాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చి, భక్తుల హృదయాల్లో చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.