హైకోర్టు తీర్పుతో రేగా కాంతారావుకు భారీ ఊరట
దమ్మపేట: బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంపై బీఆర్ఎస్ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. రేగా కాంతారావును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. రేగా కాంతారావుపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన తరఫున చేసిన వాదనలను పరిశీలించిన గౌరవ తెలంగాణ హైకోర్టు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ తీర్పు ఇవ్వడం రేగా కాంతారావుకు భారీ ఊరటనిచ్చిందన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టి ఒక నాయకుడి ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ, చివరకు న్యాయస్థానం తీర్పుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.రేగా కాంతారావు ప్రజా జీవితంలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ కోసం, ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని సోయం వీరభద్రం అన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ఆరోపణలు, కేసుల ద్వారా ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అయితే న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచిన రేగా కాంతారావుకు హైకోర్టు తీర్పు న్యాయం చేకూర్చిందని తెలిపారు.”హైకోర్టు తీర్పుతో నిజమే గెలిచింది.. తప్పుడు ప్రచారానికి చెంపపెట్టు పడింది” అని సోయం వీరభద్రం అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కేసులు, ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇకనైనా రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.రేగా కాంతారావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడం ద్వారా ఆయనపై చేసిన ఆరోపణల విషయంలో న్యాయపరమైన ఉపశమనం లభించిందని, ఈ తీర్పు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సోయం వీరభద్రం పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పే అంతిమమని, ప్రజల ముందు నిజానిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.