
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బి చంద్రశేఖర్
*”2017 సంగారెడ్డి లో రాహుల్ గాంధీ సభ సక్సెస్.. పొలిటికల్ టార్గెట్ జగ్గారెడ్డి ” అనే కోణంలో పోలీసులతో నాపై, నా బంధువులపై విచారణ జరిపించారు*
*పీడీ యాక్ట్ తో నన్ను ఏడాది పాటు జైలుకు పంపాలని ప్లాన్ చేశారు*
*నాకు అప్పులు ఇచ్చినవారితో కరపత్రాలు వేయించాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు*
*నేను ఇవ్వాల్సిన డబ్బులను తామే చెల్లిస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్ నాయకులు హామీ ఇచ్చారు*
*ఇన్నాళ్లు ఈ విషయాలను నాలోనే దాచుకున్నాను.. సంగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు, మీడియా, ప్రజలకు తెలియాలని బయటపెట్టాను*
*హరీష్ రావును తప్పు పట్టను.. నిందలు వేయను.. సభ సక్సెస్ అయినందుకు కేసీఆర్ సీరియస్ అయితే రాజకీయంగా నన్ను టార్గెట్ చేశాడు*
*ఇన్నాళ్లు నా ఆట, పాటలనే చూశారు.. కానీ నా ఆవేదన, బాధలను నేనే అనుభవించాను.. నా భార్యకు సైతం చెప్పలేదు*
*ఈ విషయం రాహుల్ గాంధీకి కూడా చెప్పలేదు.. కానీ కార్యకర్తలకు తెలియాలని చెబుతున్న*
*రివెంజ్ పాలిటిక్స్ కు నేను దూరంగా ఉంటాను.. రియల్ పాలిటిక్స్ చేస్తా*
*సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ ల ముగింపు సమావేశంలో జగ్గారెడ్డి*
2017 లో సంగారెడ్డి లో రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడంతో రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు హరీష్ రావు కుట్రలు చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రతిపాదనలు పంపించారని జగ్గారెడ్డి తెలిపారు. అనంతరం ఆ కాలేజీని అప్పటి మంత్రి హరీష్రావు సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం తాను మూడేళ్లపాటు పోరాటం చేశానని, ఆ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తనపై పోలీసులతో కేసులు పెట్టించే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
2017లో సంగారెడ్డిలో రాహుల్గాంధీ సభ నిర్వహించాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తనను కోరారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి వలసలను అడ్డుకునేందుకు భారీ సభ నిర్వహించాలని నిర్ణయించి, సుమారు మూడు లక్షల మందితో సభను నిర్వహించామని చెప్పారు. ఇందుకోసం రూ.6.5 కోట్ల అప్పు తీసుకున్నామని, సభ విజయవంతం కావడంతో తనపై రాజకీయ కక్ష మొదలైందని జగ్గారెడ్డి ఆరోపించారు.
తనపై అక్రమాస్తులు, భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై అప్పటి సిటీ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తో పాటు విజిలెన్స్ విభాగానికి చెందిన ఒక ఐపిఎస్, నలుగురు డీఎస్పీ లు విచారణ జరిపారని, అయితే తన వద్ద అక్రమ ఆస్తులు లేవని విచారణలో తేలిందని చెప్పారు. పటాన్చెరులో భూ వ్యవహారాలపై కూడా విచారణ జరిపించారని, ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని పేర్కొన్నారు.
తనపై 40 పిటిషన్లు వేయించి పీడీ యాక్ట్ కింద జైలుకు పంపాలని ప్రయత్నాలు జరిగాయని జగ్గారెడ్డి ఆరోపించారు. తనకు అప్పులు ఇచ్చిన వారితో ఫిర్యాదులు చేయించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని చెప్పారు. అయితే వారు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడం తో ఆ ప్రయత్నం విఫలమైందన్నారు.
తనపై ఎలాగైనా పీడీ యాక్ట్ పెట్టాలని అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ వద్ద సమావేశం నిర్వహించారని, పోలీసులు కూడా తనపై కేసులు పెట్టడం సాధ్యం కాదని చెప్పడంతో చివరకు పాస్పోర్ట్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు.
“నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. రివెంజ్ పాలిటిక్స్ నేను చేయను. ఇప్పటికీ హరీష్రావును నేను నిందించడం లేదు. ఆయన తన వ్యూహంలో భాగంగా పని చేశారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తనపై జరిగిన పరిణామాల గురించి రాహుల్గాంధీకి పూర్తిగా తెలియకపోవచ్చని, అయితే సంగారెడ్డి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను చెబుతున్నానని జగ్గారెడ్డి అన్నారు.