పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 04:
ఈనెల 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరగనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, టొబాకో బోర్డు అధికారులను కలిసి రైతుల సమస్యలపై చర్చించేందుకు జగన్ మోహన్ రెడ్డి దేవరపల్లి వస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగానికి సరైన మద్దతు లభించలేదని, పలు పంటల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గతంలో మామిడి, అరటి, ఆక్వా రైతుల సమస్యలపై జగన్ మోహన్ రెడ్డి స్పందించిన అనంతరమే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వాహనాల రాకపోకలపై ఆంక్షలు, బారికేడ్లు, ట్రాఫిక్ పరిమితులు విధిస్తూ ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల మద్దతును అడ్డుకోలేరని, దేవరపల్లి పర్యటనకు అనపర్తి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.