– విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026.
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు భక్తులు తొలి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు.. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా తమపై ఉండాలని, స్వామివారిని వేడుకొని, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కులకర్ణి రామారావు శర్మ, కమిటీ సభ్యులు చిదుర వీరేశం గుప్త, గెంటిల సాయిలు, తాటిపాముల విజయ్, బెజుగం వెంకటేశం గుప్త, ఇందూరు చంద్రశేఖర్, పార్వతి మురళి, చింతల నరేందర్ మరియు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
