బిక్కవోలు: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు మండలంలోని బిక్కవోలు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు.
డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. నియామకాలపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ రీలే నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బేళ్ల కృష్ణారెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

