అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం
బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వ్యాపారులు, షాపుల యజమానులు, వినాయక ఉత్సవ నిర్వాహకులు, డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పండుగ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు.
ఈ సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. డీజేల ద్వారా అధిక శబ్దం చేస్తూ ప్రజలకు, వృద్ధులకు, చిన్నారులకు ఇబ్బందులు కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వినాయక మండపాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం వంటి వాటిని పోలీసులు ఉపేక్షించరని స్పష్టం చేశారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
వినాయక చవితి సందర్భంగా డీజేలు, అధిక శబ్దాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని పోలీసులు కోరారు.

