మొక్కజొన్న రైతుల ఆర్తనాదం వినిపించదా..? వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే రైతాంగం రోడ్డున పడుతుంది
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా బ్యూరో మే 8
అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మొక్కజొన్న మరియు ధాన్యం రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేక గోదాముల ఎదుట, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాలకు పంటను తరలించాల్సి వస్తోందని, దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులు ఇప్పుడు మార్కెట్లో సరైన ధరలు లేక మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను అత్యవసరంగా పరిగణనలోకి తీసుకొని ప్రతి మండలంలో అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యం మరియు మొక్కజొన్నను తక్షణమే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని దామాల సత్యం కోరారు. రైతుల పంట తడిసిపోవడం వల్ల నాణ్యత తగ్గిందనే పేరుతో కొనుగోళ్లను నిరాకరించడం అన్యాయమని, ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని అన్నారు. రైతు కష్టానికి సరైన గౌరవం ఇవ్వకుండా ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని దామాల సత్యం స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భుయ్యన వీరబాబు వరద సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

