పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ జూన్ 30 2206: ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా… వీటి అసలు ప్రమాణం ఏమిటి? ఒకే దేశం. ఒకే సమాజం. ఒకే ప్రజలు. కానీ ఒకే ప్రమాణం మాత్రం కనిపించడం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం బయటకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మీడియా రోజుల తరబడి చర్చలు నిర్వహించింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతిన్నదని చెప్పింది. అదే సమయంలో అయోధ్య రామమందిరానికి సంబంధించిన భూమి కొనుగోళ్లు, విరాళాల నిర్వహణ, ట్రస్ట్ పారదర్శకతపై వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, మీడియా వర్గాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ అక్కడ కనిపించిన స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. “ఇది రాముడి ఆలయం… మాట్లాడకండి.” “పవిత్రతను రాజకీయాల్లోకి లాగొద్దు.” “ఇలాంటి విషయాలు చర్చించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది.” అనే వాదనలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ఇక్కడ అసలు ప్రశ్న లడ్డూ గురించో, రామాలయం గురించో కాదు. ఒక ఆలయానికి సంబంధించిన అంశం బయటకు వచ్చినప్పుడు “భక్తుల మనోభావాలు” పేరుతో దేశవ్యాప్తంగా చర్చ జరగాలి… మరో ఆలయానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు అదే భక్తుల మనోభావాలు పేరుతో చర్చనే ఆపేయాలా? ఈ రెండు సందర్భాల్లోనూ నిజం తెలుసుకోవడం కంటే, రాజకీయ ప్రయోజనం ముఖ్యమైందా? ఏదైనా తప్పు జరిగి ఉంటే, అది తిరుమలలో జరిగినా తప్పే. అయోధ్యలో జరిగినా తప్పే. ఏ తప్పూ జరగకపోతే, రెండింట్లోనూ నిజాన్ని నిర్ధారించడం అవసరమే. సమస్య దేవుళ్లలో లేదు. సమస్య రాజకీయాలలో కూడా ఒక్కటే కాదు. సమస్య… ఒకే సంఘటనను రెండు వేర్వేరు కొలమానాలతో కొలిచే మన సామాజిక, రాజకీయ మనస్తత్వంలో ఉంది. మనకు నిజం కావాలా? లేక… మనకు నచ్చిన నిజం మాత్రమే కావాలా? ప్రజాస్వామ్యం అనేది ఎవరి విశ్వాసాన్ని అవమానించడం కాదు. అదే సమయంలో విశ్వాసం పేరుతో ప్రశ్నించే హక్కును మూసివేయడం కూడా ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలు మారుతాయి. రాజకీయ పార్టీలు మారుతాయి. మీడియా కథనాలు కూడా మారిపోతాయి. కానీ సమాజం ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. సత్యానికి రెండు ప్రమాణాలు ఉండవు. ఉంటే అది సత్యం కాదు… రాజకీయ సౌలభ్యం మాత్రమే.
తిరుమల వివాదం వర్సెస్ అయోధ్య వివాదం
RELATED ARTICLES
