పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 23 2026: ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం” పోస్టర్ను తెలంగాణ ఉద్యమ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి, డాక్టర్ కె.వి. కృష్ణారావు, నందిగామ రాజ్ కుమార్ జానీ, బొబ్బిలి భరత్ చంద్ర, వేల్పుల మురళీ, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అయితే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25,000 గౌరవ పెన్షన్, ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉద్యమకారుల ప్రత్యేక కోటా, అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన, ఉద్యమకారుల గౌరవ పరిరక్షణ మరియు వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

