మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర మండలం : దమ్మాయి గూడ : దమ్మాయిగూడ డివిజన్–4లో SIR రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా, దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్ రామాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఓటర్ల జాబితా గ్రామసభలో పాల్గొని, వివిధ పోలింగ్ బూత్లకు సంబంధించిన ఓటర్ల జాబితాలను పరిశీలించడం జరిగింది. దమ్మాయిగూడ డివిజన్లోని 39 పోలింగ్ బూత్లలో గతంలో సుమారు 48,000 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం సుమారు 33,000 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారు వంటి కారణాలతో కొన్ని ఓట్లు తొలగించబడటం సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, అర్హత కలిగిన నిజమైన ఓటర్ల విషయంలో మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదు. ప్రస్తుతం సుమారు 33,000 మంది ఓటర్లలో కేవలం 9,000 మంది వివరాలు మాత్రమే క్లియర్గా పూర్తయినట్లు, మిగిలిన సుమారు 24,000 మందికి నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, గతంలోనుంచి ఓటరు జాబితాలో ఉన్నవారు, సరైన చిరునామా మరియు వివరాలు అందించినప్పటికీ కొందరికి నోటీసులు రావడం, నోటీసులు అందుకున్న వారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో గడువు ఇవ్వడం వంటి అంశాలపై స్పష్టత అవసరం. ఒక ముఖ్యమైన ప్రశ్న – నోటీసు ఈరోజు అందించి, రేపే ఆధారాలు సమర్పించాల్సిందిగా గడువు ఇస్తే, సాధారణ ఓటరు అంత తక్కువ సమయంలో అవసరమైన పత్రాలను ఎలా సమర్పించగలరు?. అదీ కాకుండా పండుగ రోజు కావడం, కొంతమంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉండటం, ఫోన్లో సంప్రదించలేకపోవడం వంటి అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గడువు ముగిసిన కారణంగా నిజమైన భారత పౌరుడి ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి మాత్రం రాకూడదు. ఇక్కడ పనిచేస్తున్న BLOలు, BLA-2లు తమ పరిధిలో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నారు. వారిని తప్పుపట్టడం మా ఉద్దేశం కాదు. అయితే, వారికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు, నోటీసులు అందుకున్న ఓటర్ల పూర్తి సమాచారం, ఆన్లైన్లో పత్రాలు ఎలా అప్లోడ్ చేయాలి. ఏ ఆధారాలు స్వీకరించాలి వంటి అంశాలపై సరైన శిక్షణ మరియు వ్యవస్థ అవసరం. అలాగే, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ బూత్లలో ఉండటం, చిరునామా మార్పులు, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతకు అవకాశం కల్పించడం వంటి అంశాలు కూడా సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. SIR అంటే కేవలం ఓట్లు తొలగించడం మాత్రమే కాదు – అర్హులైన ప్రతి భారత పౌరుడి పేరు సరైన వివరాలతో ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం కూడా ఎన్నికల సంఘం బాధ్యత. కాబట్టి ఎన్నికల సంఘం మరియు సంబంధిత అధికారులు:. నోటీసులు అందుకున్న ఓటర్లకు తగినంత సమయం ఇవ్వాలి. సరైన ఆధారాలు ఉన్నప్పటికీ నోటీసులు వచ్చిన కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలి.
ప్రతి BLOకు స్పష్టమైన మార్గదర్శకాలు, అవసరమైన సాంకేతిక సహాయం అందించాలి. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరును సంప్రదించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఒకే కుటుంబంలోని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చోట సరైన పోలింగ్ బూత్కు అనుసంధానం చేయాలి. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా కేవలం సాంకేతిక లేదా ప్రక్రియాపరమైన సమస్యల వల్ల ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. గ్రామసభలు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలి. ఓటు హక్కు ఒక సాధారణ హక్కు కాదు _ ప్రజాస్వామ్యానికి అది పునాది. SIR ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది, నిజమైన ఓటర్లకు పూర్తి న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలి. “అర్హుడైన ఒక్క ఓటరు కూడా మిగలకూడదు… అనర్హుడైన ఒక్క ఓటు కూడా ఉండకూడదు” అనే సూత్రంతో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ జరగాలని ప్రజల తరఫున కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో BLO అధికారులు, BLA 2 లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కాలనీల వాసులు పాల్గొన్నారు. గాలి సంపత్ యాదవ్, భారతీయ జనతా పార్టీ, మేడ్చల్ జిల్లా రూరల్ నాయకులు.
