కథల్ సావ్ తాత దర్గా ఉర్సులో పాల్గొన్న బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 27, 2026: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాగాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన కథల్ సావ్ తాత దర్గా ఉర్సు మహోత్సవంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడం సామాజిక సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరియాలని కథల్ సావ్ తాతను మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. దర్గాలు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు ప్రజలను ఐక్యంగా ఉంచే ఆధ్యాత్మిక కేంద్రాలని, పరస్పర గౌరవం మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో ఇలాంటి ఉర్సు ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని వెంకటన్న గౌడ్ అన్నారు. రైతాంగం సుభిక్షంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ ఏడాది ప్రకృతి అనుకూలించి మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ఉర్సు మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కథల్ సావ్ తాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

