ఆకలితో ఉన్నవారికి అన్నమే వినాయకుడి ప్రసాదం.
మండపం వద్ద కాకుండా నిరుపేదల చెంతకు అన్నదానం తీసుకెళ్లిన గాంధీనగర్ వినాయక భక్త మండలి.
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి
పండుగ అంటే పూజలు, ఉత్సవాలతో పాటు పేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ అని చాటిచెప్పారు లక్షెట్టిపేట గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు. వినాయక నవరాత్రుల సందర్భంగా మండపం వద్ద అన్నదానం చేయడం కంటే.. నిజంగా ఆకలితో ఉన్న వారి చెంతకే అన్నప్రసాదాన్ని తీసుకెళ్లాలనే మానవీయ ఆలోచనతో ఆదివారం వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
లక్షెట్టిపేటలో ఆదివారం వారసంత కావడంతో పట్టణంలోని సంత మార్కెట్లో చిరు వ్యాపారులు, వికలాంగులు, నిరుపేదలు ఉదయం నుంచి తమ జీవనోపాధి కోసం శ్రమిస్తున్నారు. వారి పరిస్థితిని గమనించిన గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు, మహిళలు కలిసి 300 వెజిటేబుల్ బిర్యానీ బాక్సులు, వాటర్ బాటిళ్లను సిద్ధం చేసి స్వయంగా వాహనంలో సంతకు తీసుకెళ్లారు. అక్కడ ఒక్కొక్క చిరు వ్యాపారి, నిరుపేద, వికలాంగుడి వద్దకు వెళ్లి ఆహారం, నీటిని అందించారు.
ప్రతి సంవత్సరం వినాయక మండపాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ.. ఈసారి ఆకలితో ఉన్నవారి చెంతకు వెళ్లి అన్నప్రసాదం అందించడం ద్వారా భక్తితో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ఇదేవిధంగా నిరుపేదలకు అన్నప్రసాద బాక్సులను అందిస్తున్నామని గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు పల్లెర్ల మనోహర్ దుర్గాప్రసాద్ లు తెలిపారు. తమకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారం అవసరం లేదన్నట్లుగా స్వయంగా ఆహారాన్ని తీసుకెళ్లి పంపిణీ చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది.
‘మండపం వద్ద భోజనం పెట్టడం కంటే.. ఆకలితో ఉన్నవారి వద్దకు వెళ్లి అన్నం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది’ అని మండలి సభ్యులు పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా భోజనం, నీటిని అందించిన మండలి సభ్యులకు సంతలోని చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు పల్లెర్ల సురేష్, దుర్గాప్రసాద్, పల్లెర్ల మనోహర్,బొల్లం రామకృష్ణ, పల్లెర్ల శివకుమార్, కజ్జం రమేష్ బాబు, నల్మాస్ శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, గోయికారి వాసు, బొద్దుకూరి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.



