లక్షెట్టిపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి!
• ఆంధ్రాబోర్ లాడ్జిలో ఆరుగురు అరెస్ట్
• ₹1 లక్ష నగదు స్వాధీనం.. నిందితుల్లో కీలక రాజకీయ నాయకుడు?

లక్షెట్టిపేట, మే 12:
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మంగళవారం పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని ఆంధ్రాబోర్ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే
పట్టణంలోని సదరు లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ తమ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి లాడ్జిపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో రాజకీయ పార్టీ కీలక వ్యక్తులు ఉండడంతో పట్టణంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సదరు నాయకుడిని కాపాడేందుకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలోని మిగతా లాడ్జీల నిర్వాహకుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.
