లక్షల జీతం కంటే మనశ్శాంతే ముఖ్యమని ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవర్గా కొత్త జీవితం!

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో
బెంగళూరు, మే 31, 2026
ఈరోజుల్లో ఐటీ ఉద్యోగం అంటే లక్షల జీతం, ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులు, విలాసవంతమైన జీవితం అనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఆ మెరుపుల వెనక ఉన్న ఒత్తిడి, టార్గెట్లు, రాత్రింబవళ్లు పని చేసే పరిస్థితులు ఎంతమందిని మానసికంగా అలసటకు గురి చేస్తున్నాయో తాజాగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చెబుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లోనే బెంగళూరుకు చెందిన ఓ మహిళ ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేసి ఆటో డ్రైవర్గా మారింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో మంచి జీతం వచ్చినా, మానసిక ప్రశాంతత మాత్రం దొరకలేదని తెలిపింది. రోజుకు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, నిరంతర ఒత్తిడి, టార్గెట్లు, మీటింగ్స్ వల్ల తీవ్ర మానసిక అలసటకు గురయ్యానని పేర్కొంది. దీంతో తన జీవితాన్ని తాను నియంత్రించుకునేలా కొత్త మార్గాన్ని ఎంచుకుందట.ఇప్పుడు ఆమె బెంగళూరు నగరంలో ఆటో నడుపుతూ తనకు నచ్చిన సమయాల్లో పని చేస్తోంది. ముఖ్యంగా యాప్ ఆధారిత ఆటో సర్వీసుల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తూ నెలకు రూ.60 వేలకుపైగా సంపాదిస్తున్నట్లు వీడియోలో వెల్లడించింది.కార్పొరేట్ ఉద్యోగంలో డబ్బు ఉన్నా ఆనందం లేదు. ఇప్పుడు శారీరకంగా అలసట ఉన్నా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అని ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఐటీ రంగంలో పెరుగుతున్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చాలా మంది యువత ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ కోసం సంప్రదాయ ఉద్యోగాలను వదిలి తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో మానసిక ఒత్తిడి, బర్నౌట్ సమస్యలు పెరుగుతున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధిక జీతాల కంటే ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయం, మనశ్శాంతి ముఖ్యమనే భావన యువతలో పెరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.ఈ మహిళ తీసుకున్న నిర్ణయం సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది. జీతం మాత్రమే కాదు… మనసుకు నచ్చిన జీవితం కూడా ముఖ్యమే” అని ఆమె కథ చెబుతోంది.
