–వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25, 2026: జూన్ 25 నుంచి ప్రారంభమవుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ… అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలోని తప్పుల సవరణ, నకిలీ ఓట్ల గుర్తింపు, తొలగింపు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను గుర్తించడం, ఓటరు జాబితాలోని లోపాలను సరిచేయించడం, మరణించినవారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి బూత్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు.

