రైతులకు స్థిరమైన మార్కెట్ – మహిళా సంఘాలకు ఉపాధి
విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 12 2026: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల సాగు, సేకరణపై మంగళవారం ప్రజాభవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ఎల్ నినో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్, విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ఐఏఎస్, ఉద్యానవన, సెర్ప్, హరేకృష్ణ మిషన్, మన్నా ఫౌండేషన్, అక్షయపాత్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించి, రైతుల నుంచి నేరుగా కూరగాయలను సేకరించే విధానంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని 20 లక్షల 50 వేల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు ప్రతిరోజూ సుమారు 1.20 లక్షల కిలోల కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. కిచెన్ల పరిధిలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో పాటు, కొత్తగా సాగు చేయాలనుకునే రైతులు, మహిళా రైతులు, మహిళా సంఘాలను గుర్తించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి 20 వరకు వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల అవసరాలు, సాగు విస్తీర్ణం, విత్తనాలు, నీటి వసతి, సబ్సిడీలు, మార్కెటింగ్, సేకరణ అంశాలపై వివరాలు సేకరించలన్నారు. జిల్లా స్థాయిలో సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఈ నెల 22వ తేదీలోగా రాష్ట్రస్థాయికి పంపించాలని డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 22వ తేదీన నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై, కూరగాయల సేకరణ, మహిళా సంఘాల భాగస్వామ్యం, 39 సెంట్రలైజ్డ్ కిచెన్లకు సరఫరా వ్యవస్థ, రైతులకు అవసరమైన ప్రభుత్వ సహాయంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రైతు పండించిన కూరగాయలకు స్థిరమైన మార్కెట్, మహిళా సంఘాలకు ఉపాధి, విద్యార్థులకు తాజా పోషకాహారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

