- పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే06:తూర్పుగోదావరిజిల్లా అనపర్తి :పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు.విజిలెన్స్ విచారణ పేరుతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. విచారణలో ఏమీ తేలకముందే పచ్చ పత్రికలకు వివరాలు లీక్ కావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. విచారణ నిజాయితీగా జరుగుతోందా లేక రాజకీయ ప్రయోజనాల కోసమేనా అని అనుమానం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ ఎంతో కష్టపడి జరిగిందని గుర్తు చేశారు. రైతులను ఒప్పించి ప్రభుత్వ ధరలకు భూములు సేకరించామని తెలిపారు. అలాంటి భూములపై ఇప్పుడు దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో దేవాలయ భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం వల్ల ఆలయాల ఆదాయానికి నష్టం కలిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను మరిచి, జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని చూస్తోందని విమర్శించారు. ఇది పేదల హక్కులపై నేరుగా దాడి అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలపై తాము ఆధారాలు సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చెరువు మట్టి తవ్వకాలపై విజిలెన్స్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు.
అదేవిధంగా, ఎమ్మెల్యే కుటుంబ కార్యక్రమాల కోసం వ్యాపారస్తుల నుంచి బంగారు బిస్కెట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై సీసీ ఫుటేజీ విడుదల చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే అవినీతిపై స్పష్టత ఇవ్వాలని, భారీ ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు వివరించాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.

