- పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే11:
అపర దానకర్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహాన్ని గొల్లలమామిడాడ గ్రామంలో యువ నాయకుడు చింతా దొరబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బసివి రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
సామాజిక సేవ, దాతృత్వం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో జీవించిన బసివి రెడ్డి చేసిన సేవలను నేటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దొరబాబు అవిరళంగా కృషి చేస్తున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. బసివి రెడ్డి జీవిత విశేషాలు, ఆయన చేసిన మంచి పనులు గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వారికి కూడా తెలిసేలా దొరబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఐదు తరాల అనంతరం కూడా బసివి రెడ్డి ఖ్యాతిని ప్రజల్లో నిలబెట్టడం సాధారణ విషయం కాదని, దొరబాబు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. బసివి రెడ్డి పేరు మరింతగా వ్యాప్తి చెందేలా కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బసివి రెడ్డి ఒక ప్రతీకగా నిలిచారని, అలాంటి మహనీయుడి జ్ఞాపకాలను తరతరాలకు అందించాలనే లక్ష్యంతో దొరబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
బసివిరెడ్డి విగ్రహా ప్రతిష్టతో గ్రామ ప్రజలు దొరబాబు సేవాభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

