పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప, ఆగస్టు 24 : ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పిజిఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీ పై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అలా పరిష్కరించి నప్పుడే ప్రజల్లో అర్జీల పరిష్కారం పట్ల నమ్మకం కలుగుతుందన్నారు. జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిజిఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల్లో పీజీఆర్ఎస్ ద్వారా పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. తహసీల్దార్లు, శాఖాధిపతులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీ తిరిగి ఓపెన్ కాకుండా సంబంధిత అధికారి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల పరిష్కార నివేదిక అందివ్వడంలో.. సంబంధిత అధికారి, ఫిర్యాదు దారులకు సరైన విధంగా స్పష్టంగా సమాధానం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు రంగస్వామి, జాన్ ఇర్విన్, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, డ్వామా పిడి ఆదిశేషా రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదతరులు పాల్గొన్నారు.
