పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 07 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్లో మంగళవారం సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏ లు), ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ప్రతి బూత్ పరిధిలోని అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేయడం, మరణించినవారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణలు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, బిఎల్ఏ లు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఐదు రోజుల్లోనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన గడువులోగా ప్రతి బూత్లో సవరణ ప్రక్రియ పూర్తి చేసి నివేదికలను అందజేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండలం బిఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వనపర్తి జిల్లా నాయకులు,పెద్దమందడి మండల నాయకులు, సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
