-పలుస శంకర్ గౌడ్ సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు 
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 08 2026: క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. 1942 ఆగస్టు 8 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజని ఆయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయుల అనుమతి లేకుండానే బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని యుద్ధంలోకి దింపడాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన చారిత్రాత్మక సభలో మహాత్మా గాంధీ ఇచ్చిన “చావండి లేదా చనిపోండి” (Do or Die) నినాదం దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను మరింత బలపరిచిందన్నారు. ఉద్యమం ప్రారంభమైన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేసినప్పటికీ, యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారతీయులకు త్యాగం, ధైర్యం, ఐక్యత అనే మూడు గొప్ప పాఠాలను నేర్పిందన్నారు. లక్షలాది మంది జైలు పాలైనా, అనేక మంది ప్రాణత్యాగాలు చేసినా స్వాతంత్ర్య సాధన కోసం పోరాటం ఆగలేదని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలకులకు భారతీయుల స్వాతంత్ర్య సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేసిందని, చివరకు 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించడానికి ఈ ఉద్యమం కీలకమైన మలుపుగా నిలిచిందన్నారు. నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమేనని అన్నారు. ప్రస్తుత తరంలోనూ దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అన్యాయం, పేదరికం వంటి సమస్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించాలని శంకర్ గౌడ్ అన్నారు.
