రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 11 2026: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే రెండు నెలల్లో దీని ప్రభావం మరింత పెరిగి వర్షాలు తగ్గి పోయే ప్రమాదం ఉందని, అందువల్ల రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్, కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులను సూచించారు. ప్రతి మంగళ వారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దమందడి రైతు వేదికలో రైతులకు శాస్త్రజ్ఞుల ద్వారా కల్పిస్తున్న అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రస్తుతము నీళ్లు వస్తున్నాయి కదా అని తొందరపడి వరి నాళ్ళు వేసుకోవద్దని రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు రైతుల దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం పెద్దమందడి మండలంలో ఆగస్టు నాటికి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయలేదని ఈ సంవత్సరము కేవలం 76 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరం పెద్దమందడి మండలంలో 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే 18,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు గణాంకాలు తెలిపారు. కానీ ఈ సంవత్సరం వరి సాగుకు సరైన నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. భూగర్భజలాలు సైతం గణనీయంగా తగ్గిపోతున్నాయని, రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే పెద్దమందడి మండల రైతులు తెలివిగా ఆలోచించి ఆరుతడి పంటలైన వేరుసెనగ, మినుములు, కూరగాయలు, పామాయిల్ సాగు చేసుకొని ఇతర మండలాలకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఆరుతడి పంటలకు అవసరమైన మేలురకం, లాభదాయకమైన విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పోస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ… పామాయిల్ సాగు కొరకు ప్రభుత్వము అత్యధికంగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందని, రైతులు పామాయిల్ సాగు చేసుకుని అత్యధికంగా లాభాలు అర్జించాలని సూచించారు. వరి సాగుకు ఒక ఎకరాకు వాడే నీటితో పామాయిల్ పంటను మూడు ఎకరాలు సాగు చేసుకోవచ్చని తెలియజేశారు. పామాయిల్ దిగుబడి ఎకరానికి ఐదు నుంచి ఏడు టన్నులు వస్తుందని, ఇప్పటికే పామాయిల్ సాగు చేసిన రైతులు ప్రతి నెల లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. కూరగాయల సాగుకు సైతం ప్రభుత్వం ఎకరానికి 9600 సబ్సిడీ ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకొని కూరగాయలు పండించి లాభాలు ఆర్జించవచ్చన్నారు. రైతుల తరపున వెంకట రెడ్డి, రైతు మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో గత ఐదు సంవత్సరాల కంటే ముందు ఆరు తడి పంటలే వేసుకునే వారిని కానీ జిల్లాకు సాగునీరు విస్తృతంగా ఇవ్వడం వల్ల ఇలాంటి కష్టం లేని వరి సాగుకు రైతులు అలవాటు పడిపోయారని తెలియజేశారు. వరి పంటకు మంచి గిట్టుబాటు ధర తో పాటు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం జరుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వరి సాగు కాకుండా వేరే పంటలు ఎందుకు సాగు చేస్తారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆరుతడి పంటల విత్తనాలు మేలు రకం ఇవ్వడంతో పాటు వీటికి కూడా బోనస్ చెల్లించాలని కోరారు. నాణ్యమైన వేరుసెనగ విత్తనాలు అందిస్తే రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతారని అన్నారు. మండల వ్యవసాయ అధికారి సైదులు సర్పంచ్ సూర్యగంగమ్మ సైతం మాట్లాడి రైతులకు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ పర్ణిత, సింగిల్ విండో చైర్మన్, సత్యారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.