పొలిటికల్ పవర్, ఆగస్టు 18 దమ్మపేట: బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. నాటి మొఘల్ సుల్తాన్లు, స్థానిక భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, ఖిలాషాపూర్లో రాతి కోటను నిర్మించి స్వయంపాలనను సాధించిన గొప్ప విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
కుల, మత భేదాలకు అతీతంగా శ్రమజీవులను ఏకం చేసి, భూస్వాముల సంపదను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టి వారికి ఆత్మగౌరవాన్ని కల్పించిన పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలోని సామాన్య వర్గాలు కూడా రాజ్యాధికారాన్ని సాధించగలవని తన పోరాటం ద్వారా నిరూపించిన మహనీయుడు పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఘనంగా నివాళులర్పించారు.
