పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
◆ రూ. 900 కోట్ల గురుకుల విద్యాలయాల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
◆ అమ్మలా ఆదరించాల్సిన ప్రభుత్వమే నాసిరకం కూటితో విషం చిమ్ముతోంది
◆ తెలంగాణ బిసి, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్ జేఏసీ జిల్లా కన్వీనర్ ఉదయ్ స్వేరో వారియర్ ఆగ్రహం
ఖమ్మం, సెప్టెంబర్ 19 : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న రెక్కాడితే గానీ డొక్కాడని పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం రాక్షసంగా ఆడుకుంటోందని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్ జేఏసీ జిల్లా కన్వీనర్ ఉదయ్ స్వేరో వారియర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం, స్వేరోస్ నెట్వర్క్, భీమ్ వారియర్స్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగా చదువుకొని, పౌష్టికాహారం తిని ప్రయోజకులు అవుతారన్న నమ్మకంతో గురుకులాలకు పంపితే, ప్రభుత్వం మాత్రం కాసుల కక్కుర్తి కోసం కల్తీ సరుకులు పంపిణీ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్ లిస్ట్లో ఉన్న ‘నేకాఫ్’ అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ. 900 కోట్ల నిత్యవసర సరుకుల కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవో నెం. 17ను రద్దు చేసి, ఈ దందాలపై ‘సిట్’ ఏర్పాటుచేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కల్తీ ఆహారంతో క్యాన్సర్ ముప్పు : జీవో 17తో వికేంద్రీకరణకు ముగింపు
విద్యార్థులకు అందించే ఆహారంలో బ్రాండ్ లేని నాసిరకం గోధుమపిండి, గంటసేపైనా ఉడకని ఆఫ్రికన్ పప్పులు, కల్తీ నూనెలు సరఫరా చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. మార్కెట్లో కేజీ రూ. 50 ఉండే గోధుమపిండిని రూ. 66కి, రూ. 40 ఉండే చక్కెరను రూ. 60కి, రూ. 221 ఉండే ఎండుమిర్చిని రూ. 350 చొప్పున అధిక ధరలకు చూపిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నాసిరకం, కల్తీ ఆహారం తినడం వల్ల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో పాటు మానసిక ఆందోళనలు, శరీర ధృఢత్వం కోల్పోవడం, చివరికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కూడిన కమిటీల ద్వారా నాణ్యమైన సరుకులు వచ్చాయో లేదో పరిశీలన చేసేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ కమిటీలను రద్దు చేసి సెంట్రలైజ్డ్ టెండర్ల పేరిట చిరు వ్యాపారుల పొట్ట కొడుతోందని విమర్శించారు.
అధిక ధరల వల్ల విద్యార్థులకు వారానికి ఐదు
రోజులు ఇవ్వాల్సిన గుడ్లను రెండు, మూడు రోజులకు కుదించి, అవి కూడా నాసిరకం (తక్కువ గ్రేడ్) గుడ్లను అందిస్తున్నారని ఆవేదన చెందారు.
అదృశ్య శక్తుల చేతిలో ‘నేకాఫ్’.. రద్దు చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం ఖాయం
గతంలో ప్రభుత్వ మార్క్ఫెడ్ డిపార్ట్మెంట్ చేత బ్లాక్ లిస్ట్లో పెట్టబడిన ‘నేకాఫ్’ సంస్థకు ఏ ప్రాతిపదికన మళ్లీ టెండర్లు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాయకులు నిలదీశారు. అసలు నేకాఫ్ వెబ్సైట్లో బాధ్యుల పేర్లు ఉండవని, దానికి ఎండీ ఎవరో, అసలు కార్యాలయం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదని తెలిపారు. శ్రీనివాసరావు, మస్తాన్ రావు అనే వ్యక్తులు తెరవెనుక ఉండి ముడుపులు అప్పగించే పనిలో పడ్డారని, అధికారుల సమక్షంలోనే ఈ దోపిడీ జరుగుతోందని వారు ఆరోపించారు. తక్షణమే నాసిరకం సరుకుల కాంట్రాక్టును వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్ కంకణాల శ్రీనాథ్, స్వేరోస్ సీనియర్ నాయకులు దామెర్ల పృథ్వి రాజ్, బక్క వెంకటేశ్వర్లు, తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారపోగు నాగయ్య, కోండ్రు రామచంద్రు, సోలెపోగు శ్యాంసుందర్, హాస్టల్స్ నాయకులు సాయి, ప్రేమ్ కుమార్, బహుజన నాయకుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

