ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతగురుపౌర్ణమి మహోత్సవాలకు సిద్ధమైన ఆంధ్ర శిరిడి

గురుపౌర్ణమి మహోత్సవాలకు సిద్ధమైన ఆంధ్ర శిరిడి

📰 Generate e-Paper Clip

 

బలభద్రపురం సాయినాధుని ఆలయంలో ఘన ఏర్పాట్లు – వేలాదిగా తరలిరానున్న భక్తులు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 27:

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ఆంధ్ర శిరిడి సాయినాధుని ఆలయం గురుపౌర్ణమి మహోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సాయిబాబా భక్తుల ఆధ్యాత్మిక నిలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుండగా, ఈ ఏడాది కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సబ్బేళ్ల పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ, గురుపౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు లోకకళ్యాణార్థం శ్రీ సాయినాధునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, శ్రీచక్ర నవావరణార్చన, లక్ష కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, చండీ మూలమంత్ర హోమం, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణం, సహస్ర జ్యోతిర్లింగార్చన, అనంతరం పూర్ణాహుతి వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అలాగే స్వామివారి మూలవిరాట్టుకు 1,008 లీటర్ల ఆవుపాలతో మహాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేసే అవకాశం కూడా కల్పించామని, అనంతరం విచ్చేసే భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

సాయంత్రం శ్రీ సాయిబాబా ఉత్సవమూర్తిని గ్రామ పురవీధుల్లో సాయినామ సంకీర్తనలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా గ్రామోత్సవంగా ఊరేగించనున్నట్లు తెలిపారు. ఈ శోభాయాత్రతో బలభద్రపురం గ్రామమంతా భక్తిరసంలో మునిగిపోనుంది.

ఆంధ్ర శిరిడిగా భక్తుల విశేష ఆదరణ పొందిన ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో దర్శనం, పార్కింగ్, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

గురుపౌర్ణమి మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ సాయినాధుని దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ సబ్బేళ్ల పురుషోత్తమరెడ్డి భక్తులను ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!