మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ.పాండు రంగారావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర మండలం : దమ్మాయిగూడ : వివరాల్లోకి వెళితే దమ్మాయిగూడ లోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై రాత్రి సమయంలో హాస్టల్లో దాదాపు 12 మంది తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి క్రూరంగా దాడి చేశారు.
- బాధితుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, స్కూల్ యాజమాన్యం మాత్రం అతడు మెట్లపై నుంచి కిందపడిపోయాడని తల్లిదండ్రులకు ఫోన్ చేసి అబద్ధం చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది కనీసం గమనించకపోవడం, ఆపడానికి ప్రయత్నించకపోవడం హాస్టల్స్ నిర్వహణ ఘోర వైఫల్యాన్ని చూపిస్తోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస రక్షణ కల్పించలేకపోవడం, తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండించదగిన విషయం. మైనర్లనే సాకుతో ఇటువంటి హింసాత్మక ప్రవృత్తిని వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి బాధ్యులైన యాజమాన్యంపై, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు, తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
