గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం – మాజీ ఎమ్మెల్యే తాటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో భద్రాచలం పద్మావతి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో డా. మండవ తేజస్విని (MBBS, OBG – Obstetrics & Gynaecology) మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిశీలించి వైద్య సలహాలు అందించగా, డా. సాయి కుమార్ కంచెటి (MBBS, MD Pediatrics, PGPN, PRO – Boston, Neonatologist) చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులను అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, హాస్పిటల్ నిర్వాహకులు తాటి వెంకటేశ్వర్లు గారిని ఘనంగా సన్మానించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తాటి వెంకటేశ్వర్లు గారు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి జితేందర్ రెడ్డి ,మాజీ సర్పంచ్ బైటి రాజేష్ , మడకం సతీష్ , వార్డ్ మెంబెర్ కొండ్రు మధు, గోపి తదితరులు పాల్గొన్నారు..
