రేగా కాంతారావుపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని హైకోర్టు కేసును కొట్టివేసిందన్న దొడ్డా రమేష్
దమ్మపేట: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని హైకోర్టు కేసును కొట్టివేసిందని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ అన్నారు. కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని, తప్పుడు ప్రచారానికి ఇది చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దొడ్డా రమేష్ మాట్లాడుతూ.. చదువుకున్న వ్యక్తిగా, విద్యాబోధనలో అనుభవం కలిగిన నాయకుడిగా, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రేగా కాంతారావు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. కార్యకర్తలను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలిచే నాయకుడిగా ఆయనకు పార్టీ శ్రేణుల్లో మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలపై తనదైన శైలిలో పోరాటాలు నిర్వహించారని దొడ్డా రమేష్ తెలిపారు. గతంలో తనపై వచ్చిన పలు ఆరోపణలకు ప్రజల మధ్య ఉంటూ, తన పనితీరు ద్వారా రేగా కాంతారావు సమాధానం చెప్పారని అన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో రేగా కాంతారావుకు సంబంధించిన కొన్ని వార్తలను ఆధారంగా చేసుకుని కొందరు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
“రాజకీయం ఎవరి సొత్తు కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు” అని దొడ్డా రమేష్ పేర్కొన్నారు. నేడు ఒకరి చేతిలో ఉన్న అధికారం రేపు మరొకరి చేతిలో ఉండవచ్చని, చివరకు ప్రజల తీర్పే అంతిమమని గుర్తుంచుకోవాలని అన్నారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వడం కంటే ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడమే రేగా కాంతారావు రాజకీయ శైలికి నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులు రేగా కాంతారావు స్థాయిని నిర్ణయించలేవని, ప్రజలతో ఆయనకున్న అనుబంధం, చేసిన సేవలు, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలే ఆయన రాజకీయ ప్రస్థానానికి కొలమానమని అన్నారు.విమర్శలు ఎన్ని వచ్చినా ప్రజా తీర్పే అంతిమమని, ప్రజాసేవే అసలైన సమాధానమని దొడ్డా రమేష్ స్పష్టం చేశారు.
