పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన అభిమానులు పేర్కొన్నారు. దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు చేరవేసి సాగునీటి రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నాయకుడిగా తుమ్మలను అభివర్ణించారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరదాయినిగా మారిందని, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా రాజీవ్ లింక్ కెనాల్ రూపకల్పనలో ఆయన దూరదృష్టి ప్రతిఫలించిందని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో కూడా రాజీవ్ లింక్ కెనాల్ నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలకు భరోసాగా నిలిచిందని అభిమానులు తెలిపారు. రైతాంగం శ్రేయస్సే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి తుమ్మల నిరంతరం కృషి చేశారని కొనియాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయ, పాలనా అనుభవాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగించిన తుమ్మల నాగేశ్వరరావు, పదవుల కంటే ప్రజలకు చేసిన సేవలే శాశ్వతమనే నమ్మకంతో పనిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. క్రెడిట్ రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి పనులకే ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అభివృద్ధి, ఆయిల్ పామ్ సాగు విస్తరణ వంటి పలు రంగాల్లో తనదైన ముద్ర వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రగతి పథంలో నడిపించిన నాయకుడిగా తుమ్మల నాగేశ్వరరావు నిలిచారని ఆయన అభిమానులు పేర్కొన్నారు.

