మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన న్యాయవాదులు
ఎస్టీ బాయ్స్ హాస్టల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం సత్తుపల్లి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్యానెల్ అడ్వకేట్లు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆర్వీఎస్ఎస్ (RVSS) కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్యానెల్ అడ్వకేట్ బొర్రా వెంకట్రావు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవితాన్ని ముందుకు సాగించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అడ్వకేట్ నల్లగట్ల విజయకుమార్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని, తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు బి. మారేశ్వరరావు, జె.వి. నరేంద్ర మాట్లాడుతూ, విద్యార్థులందరూ జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థాలు సేవించబోమని ప్రతిజ్ఞ చేయాలని, వాటివల్ల కలిగే నష్టాలను తోటి వారికి కూడా తెలియజేస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ప్యానెల్ అడ్వకేట్లు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు బొర్రా వెంకట్రావు, నల్లగట్ల విజయకుమార్, బి. మారేశ్వరరావు, జె.వి. నరేంద్ర, ఎస్టీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ ఎం. శ్యామ్ కుమార్, ఏఎన్ఎం బానోతు లక్ష్మీ సౌజన్య, ఎంఎల్ఎస్సీ కోర్టు సిబ్బంది, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


