దమ్మపేట,పొలిటికల్ పవర్, ఆగస్టు 25: “ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలి… న్యాయస్థానం ప్రజల చెంతకు రావాలి” అనే సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో న్యాయస్థానం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసిన సత్తుపల్లి సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందడపు రాజేంద్రప్రసాద్ ని దమ్మపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.దమ్మపేట ప్రాంత ప్రజలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం వెళ్లాల్సి రావడం, అశ్వారావుపేట నుంచి కొత్తగూడెం వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల ముఖ్యంగా పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఈ పరిస్థితిని గుర్తించిన శ్రీ మందడపు రాజేంద్రప్రసాద్ “నా ప్రాంత ప్రజలకు న్యాయం కోసం ఇంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదు… న్యాయస్థానం ప్రజలకు మరింత చేరువలో ఉండాలి” అనే దృఢ సంకల్పంతో దమ్మపేటలో కోర్టు ఏర్పాటు కోసం కృషి ప్రారంభించారు.కోర్టు ఏర్పాటుకు చేసిన ఈ ప్రయత్నంలో ఆయన ఎన్నో కష్టాలు, అవరోధాలు, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రజల ప్రయోజనమే లక్ష్యంగా, తన ప్రాంత ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేయాలనే తపనతో నిరంతరం కృషి చేశారు.ఎన్నో సంవత్సరాలుగా చేసిన ఆయన కృషి, పట్టుదల, న్యాయవ్యవస్థ పట్ల ఉన్న అంకితభావం ఫలితంగానే దమ్మపేటలో న్యాయస్థానం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావడంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఈ విశిష్టమైన సేవలను గుర్తిస్తూ దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు మందడపు రాజేంద్రప్రసాద్ ని ఘనంగా సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ బి. భవాని , బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్కినేని నరేంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్ శ్యాం సుధాకర్, సత్తుపల్లి సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. ఆడమ్స్, న్యాయవాదులు తుమ్మ రాంబాబు, దారా మాధవరావు, కాలం సంధ్యారాణి, సంజయ్, భవాని కృష్ణ యాదవ్, ఉదయ్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
దమ్మపేట కోర్టు సాధనలో విశేష కృషి చేసిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం
RELATED ARTICLES
