– అదనపు కార్యాలయ గదుల ప్రారంభం.. –
ఎస్సై శ్రీను నాయక్ కృషిని అభినందించిన ఎస్పీ నరసింహ కిశోర్
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 02:
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: ప్రజలుకు సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంతో పాటు పోలీసు సిబ్బందికి మెరుగైన కార్యాలయ వసతులు కల్పించే లక్ష్యంతో అనపర్తి పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన అదనపు కార్యాలయ గదులను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్, ఐపీఎస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ అదనపు కార్యాలయ గదులు సిబ్బందికి అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, సౌకర్యాల విస్తరణ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఎస్పీ అన్నారు.
అనపర్తి పోలీస్ స్టేషన్ను అందంగా తీర్చిదిద్ది, నూతన కార్యాలయ గదుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎస్సై ఎల్. శ్రీను నాయక్ను ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.ఎల్.వి.కె. సుమంత్, ఎస్సైలు ఎల్. శ్రీను నాయక్, బి. దుర్గాప్రసాద్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
