జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో ఘనంగా ‘వనం–మనం’ కార్యక్రమం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి జగ్గయ్యపేట: పచ్చదనం–పరిశుభ్రతను పెంపొందిస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో జగ్గయ్యపేట పట్టణంలోని వాగ్దేవి కళాశాల ఆవరణలో ‘వనం–మనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సరిత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బుస్సా సరితను శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కలను పుట్టినరోజు కానుకగా అందజేశారు. అనంతరం కళాశాల ఆవరణలో ఉసిరి మొక్కను నాటారు. పుట్టినరోజు వేడుకలను మొక్కలు నాటే కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సమాజంలో అవగాహన పెంపొందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెద్ద ఎత్తున నాటి వనాలుగా అభివృద్ధి చేస్తే పర్యావరణ సమతుల్యత మెరుగుపడి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాడిపంటల సంరక్షణకు కూడా పచ్చదనం ఎంతో కీలకమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ఇంటి అవసరాలకు నార సంచులను ఉపయోగించడం, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించడం, ప్రకృతిని కాపాడటం ద్వారా భూమిని సంరక్షించుకోవాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బుస్సా సురేష్, మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల కొండ, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

