బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంపై బీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపు.
బుగ్గపాడు ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం.
పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 04 2026: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఉన్న భూముల అక్రమ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు బీజేపీ నాయకులను వివిధ మండల కేంద్రాల్లో ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అక్రమ భూ కేటాయింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, బుగ్గపాడు ప్రజలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయుడు రాఘవరావు స్పష్టం చేశారు.


