రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
పొలిటికల్ పవర్,చౌటిగూడెం, సెప్టెంబర్ 7: హైదరాబాద్లోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆదివాసీ యువతి ఊకే శిరీష మృతి పట్ల జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలోని శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చింది.
ఈ సందర్భంగా శిరీష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుమార్తెను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, అధికారులు అండగా నిలిచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.
శిరీష మృతి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
కుటుంబానికి ఆర్థిక భరోసా
శిరీష కుటుంబానికి జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టకాలంలో తమ వేదిక అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు కుర్సం నిరీక్షణరావు, ఉపాధ్యక్షులు గుండి ఫిలిప్, సెక్రటరీ మడివి ఎలీషా, జాయింట్ సెక్రటరీ బండారు, జాతీయ కమిటీ సలహాదారులు పీటర్ సింగయ్య, బిజ్జా రవిబాబు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుర్సం దైవ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ కాక రమేష్ జాషువా, సీయోను కుమార్, రాంబాబు, రాజు, ఇశ్రాయేలు, జాన్బాబు, పెద్దము నాగేష్, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

