పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో ఎస్ఏ ఇంగ్లీష్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి సుమిత్రమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ యదయ్య మాట్లాడుతూ… విద్యారంగానికి సుమిత్రమ్మ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గతంలో గోపాల్పేట బాలికల పాఠశాల ఉన్నతీకరణకు ఆమె విశేష కృషి చేశారని, ఎఫ్ఏసీ ప్రధానోపాధ్యాయురాలిగా సమర్థవంతంగా సేవలందించారని కొనియాడారు. విద్యార్థుల పట్ల ఆమె చూపిన ప్రేమ, అంకితభావం, విద్యాబోధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల సుమిత్రమ్మ చూపిన ప్రేమ, ఆప్యాయత, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆమె మృతి విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సుమిత్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. సుమిత్రమ్మకు నివాళులు అర్పించిన వారిలో ఎంఈవో జయరాములు, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, వెంకటేశ్వర శెట్టి, పదవీ విరమణ పొందిన జీహెచ్ఎం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

