ఆర్ఎఫ్సీఎల్లో కార్మిక దోపిడీ, అక్రమ టెండర్ల స్కామ్ బహిర్గతం చేస్తాం
తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసేవరకు వెనక్కి తగ్గేది లేదు మహేందర్ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మే 20 :
గోదావరిఖని,
ఆర్ఎఫ్సీఎల్ కంపెనీలో కార్మికుల దోపిడీతో పాటు భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కంపెనీ ప్రారంభమైన నాటి నుంచి ఉద్యోగాల పేరిట నిరుపేదలను నమ్మించి మోసం చేస్తున్నారని, ప్రస్తుతం సరిపడా కార్మికులు లేకపోయినా తక్కువ మంది కార్మికులతోనే అధిక పనిభారం మోపుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై మేనేజ్మెంట్ ఎలాంటి స్పందన చూపడం లేదని విమర్శించారు.
కంపెనీలోని డ్రమ్ములు, స్క్రాప్, పాత మెటీరియల్, ఎలక్ట్రానిక్ మోటార్లు, గ్యాస్ కట్టర్స్, కంట్రోల్ వాల్వ్స్, పైపులు, కేబుల్స్, నట్బోల్ట్స్ వంటి వస్తువులను ఎలాంటి అధికారిక టెండర్లు పిలవకుండా అక్రమ టెండర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో అన్ని విభాగాల అధికారుల సహకారం ఉందని ఆరోపించారు. వీటికి సంబంధించిన ఎలాంటి టెండర్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
స్టోర్స్, పర్చేస్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, హెచ్ఆర్, సివిల్, సేఫ్టీ అండ్ ఫైర్, ఫైనాన్స్ విభాగాల అండదండలతో ఈ భారీ స్కామ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ఆర్టీఐ ద్వారా సమాచారం కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కావాలనే తప్పుడు సమాచారం ఇస్తూ అసలు విషయాలను దాటవేస్తున్నారని, అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రతి అంశానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ అక్రమాలపై అన్ని ఆధారాలను సేకరించి త్వరలోనే ఢిల్లీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని, ఆర్ఎఫ్సీఎల్లో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేస్తామని తెలిపారు.
తప్పుడు సమాచారం ఇచ్చి నిజాలను దాచిపెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని, చివరి వరకు పోరాడి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని మహేందర్ గౌడ్ పత్రికా ప్రకటనలో హెచ్చరించారు.
