బిక్కవోలు: కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY BHARAT – ఈస్ట్ గోదావరి (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్వచ్ఛత పఖ్వాడా–2026” కార్యక్రమంలో భాగంగా పందలపాకలోని శ్రీ పడాల పెద పుల్లా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా యువతలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, చెత్తను తడి–పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, పచ్చదనం పెంపొందించడం, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. “క్లీన్ ఇండియా – గ్రీన్ ఇండియా – హెల్తీ ఇండియా” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛతను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి “మార్పులో భాగస్వాములు అవుదాం – మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం” అనే సంకల్పంతో ముందుకు సాగాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ చిర్ల శ్రీనివాస రెడ్డి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎస్.బి. నాగబాబు, MY BHARAT వాలంటీర్ యమ్. మణికంఠ రామకృష్ణ రెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
