రెండవ రోజు లఘు వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో, అతి తక్కువ కాలంలోనే భక్తుల కోర్కెలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన వారాహిమాత సన్నిధిలో ఆషాఢ మాస గుప్త నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా వారాహి దేవిగా, రెండవ రోజు లఘు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గుప్త నవరాత్రుల సందర్భంగా సుమారు 60 మంది భక్తులు వారాహిమాత మాలధారణ చేశారు. ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ నెల 23వ తేదీ వరకు గుప్త నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయని, ఈ సందర్భంగా ప్రతిరోజూ వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.
