హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.
షెడ్యూల్ ప్రకారం, ఇంటింటి సర్వే జూన్ 25 నుంచి ఆగస్టు 3, 2026 వరకు నిర్వహించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద పత్రాల పరిశీలన ఆగస్టు 3న చేపట్టనున్నారు. ముసాయిదా ఓటరు జాబితా ఆగస్టు 10న ప్రచురించబడుతుంది.
ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుంది. వాటి పరిష్కార ప్రక్రియ ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు చేపడతారు. అనంతరం తుది ఓటరు జాబితా అక్టోబర్ 12, 2026న ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సర్వే సమయంలో అధికారులు అడిగే వివరాలను, అవసరమైన పత్రాలను అందించాలని, ఓటరు జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని, ఏవైనా తప్పులు ఉంటే నిర్ణీత గడువులోపు క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.
