అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం.
సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పియన్9టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డుల ప్రకారం గత ఏడాది కులగణన సర్వే నిర్వహించిన మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ దార్ల పద్మావతికి రావాల్సిన రూ.16 వేల పారితోషకం జమ అయినట్లు నమోదై ఉన్నప్పటికీ, ఆమె బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయమై మల్లూరు చంద్రశేఖర్ శనివారం (జూలై 4) వేంసూరు మండల గణాంకాల అధికారి సంపత్ కుమార్ను చరవాణి ద్వారా సంప్రదించగా, తమ రికార్డుల్లో ఆమెకు పారితోషకం జమ అయినట్లు ఉందని, ఆమె ఇచ్చిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. పద్మావతి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించినప్పటికీ, ఆ ఖాతాలో పారితోషకం జమ కాలేదని నిర్ధారించి, ఈ విషయాన్ని జిల్లా సీపీఓకు తెలియజేశామని, అయితే వారి నుంచి ఇంకా సమాధానం రాలేదని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఖమ్మం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పద్మావతి, సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పిన్నింటి రమ్య ఆధ్వర్యంలో అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజ స్పందిస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా సీపీఓను ఆదేశించారు. అనంతరం సంబంధిత అధికారి మాట్లాడుతూ, ఇలాంటి కొన్ని చెల్లింపులు మంజూరై ఆర్బీఐ వద్ద పెండింగ్లో ఉన్నాయని, అవి త్వరలో విడుదల అవుతాయని హామీ ఇచ్చారు. అనంతరం ఇదే విషయమై వేంసూరు మండల గణాంకాల అధికారి సంపత్ కుమార్ను మల్లూరు చంద్రశేఖర్ ప్రశ్నిస్తూ, ఈ సమాచారం ముందుగానే తెలిపి ఉంటే ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. అయితే, తనను మండల గణాంకాల అధికారి ఎవరూ అడగలేదని సంబంధిత అధికారి చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అసలు ఎవరి మాట నిజమో ప్రజలే నిర్ణయించుకోవాలని మల్లూరు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

