కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన యూత్ ఫోర్స్ నాయకులు
0
16
పొలిటికల్ పవర్ దినపత్రిక/ పియన్9టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో “సౌత్ ఇండియా రాహుల్ గాంధీ యూత్ ఫోర్స్” నాయకులు చీళ్ళ నాగేశ్వరరావు, గట్టి ప్రసాదరావు (ప్రభు)లు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలెవరూ నమ్మడం లేదని పేర్కొన్నారు. కె.సి.ఆర్ హయాంలో ప్రైవేట్ వడ్డీలకు, అందిన కాడికి అప్పులు చేసి, ఇంజనీర్ల సూచనలను పెడచెవిన పెట్టి, ఇష్టారీతిన లక్షన్నర కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే నెర్రెలిచ్చి కుంగిపోయిందని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం భూకంప ప్రభావిత ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, దానిని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చి నీటి విడుదల చేస్తే, దిగువనున్న కరీంనగర్ నుంచి భద్రాచలం వరకు ఉన్న గ్రామాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారని తెలిపారు. దీంతో సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో ప్రాజెక్టుకు మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అసలు నిజాలను దాచిపెట్టి కేటీఆర్ అబద్ధాలు, అసత్యాలను గోబెల్స్ ప్రచారంలా ప్రచారం చేస్తున్నారని వారు విమర్శించారు. అదేవిధంగా, “కాంగ్రెస్ పోవాలి, కె.సి.ఆర్ రావాలి” అనే వ్యాఖ్యలకు భిన్నమైన అర్థం ఉందని పేర్కొంటూ, కాంగ్రెస్ పాలన మరింత వేగంగా ముందుకు సాగాలని, కె.సి.ఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల మధ్య తిరగాలని దాని ఉద్దేశమని వారు విపులంగా వివరించారు.